ముంబై : సైబర్ నేరగాళ్లు పోలీసులు, అధికారుల కండ్లుగప్పి రోజుకో స్కామ్తో (Cyber Fraud) రెచ్చిపోతున్నారు. పుణేలో స్కామర్లు ఓ వ్యక్తి నుంచి రూ. 18 లక్షలు దోచేశారు. ఆన్లైన్ టాస్క్ల్లో పెద్దమొత్తం కమీషన్ ఆర్జించవచ్చని బాధితుడిన మభ్యపెట్టిన స్కామర్లు అతడి నుంచి భారీ మొత్తం స్వాహా చేశారు. మగర్పట్ట ప్రాంతంలో శరద్ గుప్తా (39) అనే వ్యక్తిని స్కామర్లు ఈ ఏడాది మే, జూన్ మాసాల మధ్య మోసగించారు.
ఆన్లైన్ టాస్క్లతో ఆకర్షణీయ మొత్తాన్ని కమీషన్గా ఆర్జించవచ్చని నిందితులు తనను సోషల్ మీడియాలో సంప్రదించి ఆపై నిలువునా ముంచేశారని గుప్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే టాస్క్లతో ఇతరులు ఎలా సంపాదించారో వెల్లడించిన స్కామర్ బాధితుడి నమ్మకాన్ని చూరగొన్నాడు. దీంతో పార్ట్టైం జాబ్ ఆఫర్ను అంగీకరించిన గుప్తా తొలుత పూర్తి చేసిన టాస్క్లకు మెరుగైన కమీషన్ అందడంతో స్కామర్ను పూర్తిగా నమ్మాడు.
ఆపై పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ ఒక నెలలోనే 18.7 లక్షలను నిందితుడి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక అటుపై గుప్తాకు ఎలాంటి కమీషన్, రిటన్స్ రాకపోవడంతో పాటు తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బు సైతం విత్డ్రా చేసుకునే అవకాశం లభించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
IndiGo | రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. ఇండిగో ఫ్లైట్లో ఘటన