pregnant woman died | నాంపల్లి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సహా గర్భిణి దుర్మరణం చెందారు. మృతులను నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సంభారపు అరుణ్, రీతూ దంపతులు హైదరాబాద్లోని హస్తినాపురం వద్ద హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
అదే గ్రామానికి చెందిన నల్లవెల్లి సుందర్ హైదరాబాద్లో ఆటో నడుపుతూ భార్య రాధికతో కలిసి అక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం స్వగ్రామంలోని చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చారు. సాయంత్రం అరుణ్ భార్యతో కలిసి కారులో తిరిగి హైదరాబాద్కు బయల్దేరాడు. అయితే, నల్లవెల్లి సుందర్ తన భార్య రాధిక, పిల్లలు శ్యామ్ (5), బ్లెస్సీలను అరుణ్ కారులో ఎక్కించి తాను బైక్పై బయల్దేరాడు. కారు యాచారం మండలం పాత మాల్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న అరుణ్ భార్య రీతూ (22), సుందర్ కుమారుడు నల్లవెల్లి శ్యామ్(5) తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు.
మిగతా వారికి గాయాలు కాగా చిన్నారి బ్లెస్సీ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, అరుణ్ భార్య రీతూ (22) ప్రస్తుతం నిండు గర్భిణి. మరో 10 రోజుల్లో ఆమె డెలివరీ కోసం డాక్టర్లు టైమ్ ఇచ్చినట్లు, ఆమె కడుపులో కవలలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో రీతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.