చాంద్రాయణగుట్ట : ప్రత్యర్ధుల నుంచి ప్రాణ హానిఉందని పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్తున్న వ్యక్తిని, అతని ప్రత్యర్ధు లు పోలీస్ స్టేషన్కు సమీపంలోనే దారుణంగా హత్య చేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న వ్యక్తిని రక్షించేందుకు వెంటనే దవాఖానకు తరలించారు, అయితే మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పొయా డు. ఆర్ధిక లావాదేవీలు, హవాల, బంగారం స్మగ్లింగ్కు సంబంధించిన అంశాలు ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బార్కాస్ ప్రాంతానికి చెందిన అమీద్ బిన్ ఆల్ జుబేది (37), మిలినియం ట్రావెల్స్, వెస్ట్రన్ యూనియన్ మనీ ఆఫీస్ నడిపిస్తున్నాడు. డబ్బుల విషయంలో కొంతమందితో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. గొడవల కారణంగా తనకు ప్రాణహానీ ఉందని గ్రహించిన అమీద్ బిన్ ఆల్ జుబేది పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు.
బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బార్కాస్ నుంచి స్టేషన్కు కారులో బయలుదేరాడు.తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అమీద్ వెళ్తున్నట్లు తెలుసుకున్న ప్రత్యర్థులు స్టేషన్కు కూతవేటు దూరంలో రోడ్డుపై అమీద్ కారును ఆపి గొడవకు దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం కత్తులతో దారుణంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రక్తం మడుగులో పడి ఉన్న అమీద్ను దవాఖానకు తరలించారు.హత్యకు గల కారణాలు ఏమిటీ..ఏవరు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.