ముంబై : ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రహరీ గోడను ఆనుకుని పెట్రోల్ బాటిల్ లభ్యం కావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయ నిబంధనలను ఉల్లంఘించి ఇతరుల ప్రాణాలకు ముప్పు కల్పించిన గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 50 ఎంఎల్ పెట్రోల్తో కూడిన బాటిల్ను ప్రహారీ గోడ వద్ద విసిరివేసినట్టు విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ సిబ్బంది బుధవారం రాత్రి గుర్తించారని దీంతో నగర పోలీసులకు ఈ సమాచారం చేరవేశారని ముంబై పోలీసులు తెలిపారు.
ఘటనా ప్రాంతానికి సీఐఎస్ఎఫ్, స్ధానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకుని బాటిల్ను పరిశీలించారు. చెత్తను తొలగించే క్రమంలో పెట్రోల్ బాటిల్ను ఎవరో ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్ వద్ద విసిరివేసినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. పెట్రోల్ బాటిల్ను విసిరిన వ్యక్తిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టామని ముంబై పోలీసులు తెలిపారు.