కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలో వరుస దొంగతానాలతో కులకచర్ల గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. సోమవారం తెల్లవారు జామున అంగడి బజార్లో ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం విరుగగొట్టి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను చెల్లా చెదురుగా వేసి వెళ్లారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని బాధితులు తెలిపారు. గ్రామంలో చుట్టుపక్కల ఇండ్లల్లో కూడా చోరికి ప్రయత్నించినట్లు బాధితులు తెలియజేస్తున్నారు.
కాగా మంగళవారం తెల్లవారు జామున కూడా కులకచర్ల చౌరస్తా దగ్గరలో బైక్మెకానిక్ మైపాల్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేశారని చోరికి ప్రయత్నించారని బాధితులు తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడం వలనే దొంగతనాలకు పాల్పడుతున్నారని, వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.