తిరుమల, మే 26: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటలవరకుసుందరకాండలోని 58వ సర్గలో గల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పారాయణంలో పాల్గొన్న హంపీ క్షేత్రానికి చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో జరుగుతున్న సుందరకాండ పారాయణంలో పాల్గొనడం పూర్వజన్మ పుణ్యఫలమన్నారు.
ఈ పారాయణం రామభక్తుడైన హనుమంతునికి ఎంతో ప్రీతికరమని, ఆంజనేయుని శరణు వేడితే సకల కష్టాలు దూరమవుతాయని చెప్పారు. హనుమంతుడు చిరంజీవిగా ఉండి వర్తమాన కాలంతోపాటు భవిష్యత్ కాలంలోనూ శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తారని తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 412 రోజులు పూర్తికాగా, మే 26వ తేదీకి సుందరకాండ పారాయణం 350 రోజులు పూర్తి చేసుకుందని వివరించారు.
14వ విడత అఖండ పారాయణంలోని 167 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో పివిఎన్ఎన్.మారుతి, ఎం. పవనకుమార శర్మ పారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి దంపతులు, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.