చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్నాడని నిలదీయడంతో నిందితుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. చెన్నైలో మహిళా ప్రొఫెసర్గా పనిచేస్తున్న 45ఏండ్ల అనిత హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. కాంచీపురంలోని అంగల పరమేశ్వరి నగర్లో సోదరితో కలిసి ఉంటున్న బాధితురాలు దారుణ హత్యకు గురైంది.
అదే ఇంట్లో వేరొక ఫ్లోర్లో ఉంటున్న సోదరికి భయంతో ఫోన్ చేసిన కొద్ది నిమిషాలకే ఆమె హత్య జరిగింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడ పడిఉన్న చిరిగిన షర్ట్, బియ్యం గింజలు ఆధారంగా హత్య మిస్టరీని చేధించారు. రైస్ మిల్ యజమాని సోదరుడు, గతంలో మహిళతో కలిసి టీచర్గా పనిచేసిన సుధాకర్ ఈ అకృత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. బాధితురాలి ఫోన్ కాల్ లిస్ట్ ఆధారాలు కూడా పోలీసులకు దర్యాప్తులో ఉపకరించాయి.
అనిత, సుధాకర్లు గతంలో ఒకే స్కూల్లో పనిచేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. సుధాకర్ రోజూ రాత్రి వేళల్లో అనిత ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలో సుధాకర్కు వేరొక మహిళతో సంబంధం ఉందని తెలిసిన అనిత అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనిత తీరుతో ఆగ్రహంతో ఊగిపోయిన సుధాకర్ ఆమెను కత్తితో పొడిచి హత్యచేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు సుధాకర్ నేరాన్ని అంగీకరించాడు.