చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ కు ముందు నిందితులు తమకున్న పరిచయాలతో భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి దాచారు.
మధురై పోలీసులు శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా అక్రమ దందా బాగోతం వెలుగుచూసింది. మద్యం బాటిళ్లను నిల్వ చేసిన నిందితులు లాక్డౌన్ సమయంలో వీటిని ఎంఆర్పీ పై రెండింతలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించారని పోలీసులు తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా రేటు మరింత ఎక్కువ పలుకుతుందని చెప్పారు. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 28,897 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజే 236 మంది ప్రాణాలు విడిచారు.