న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి విదేశీ కరెన్సీ గిఫ్ట్గా పంపుతానని మభ్యపెడుతూ రూ 33 లక్షలకు మోసం చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో కలకలం రేపింది. 2020 మార్చి, జులై మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి తనతో స్నేహం నటిస్తూ బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ను బహుమతిగా పంపుతానని నమ్మబలికి మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తాను బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్తను అంటూ పరిచయం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
భారత్లో తాను పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నానని చెప్పగా తాను ఆహ్వానించానని చెప్పారు. భారత్కు తిరిగివస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తనను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తాను తీసుకువస్తున్న పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీని సీజ్ చేశారని నమ్మబలికాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆపై కస్టమ్స్ అధికారి అంటూ ఓ మహిళ ఫోన్ చేసి బెదిరించి తన ఖాతాలోకి రూ 33.35 లక్షలు బదిలీ చేయించుకుందని తెలిపారు. డబ్బు తీసుకున్న తర్వాత అనుమానితుడితో పాటు కస్టమ్స్ అధికారిగా చెప్పిన మహిళ ఇద్దరూ తన ఫోన్ కాల్స్కు స్పందించలేదని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త వారి నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్టులను ఆమోదించవద్దని, కొత్త వ్యక్తులకు నగదును ట్రాన్స్ఫర్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.