భద్రాద్రి కొత్తగూడెం : ఆధార్ లింక్ పేరిట ఓ ఉద్యోగి ఖాతా నుంచి రూ. 6.20 లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మణుగూరుకు చెందిన ఓ ఉద్యోగికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. మీ మొబైల్ నంబర్కు ఆధార్ లింక్ చేయాలని చెప్పారు. ఒక మేసేజ్ వస్తోంది.. దాని లింక్ను క్లిక్ చేయండని వారు ఉద్యోగికి సూచించారు. దీంతో వారు చెప్పినట్టే సదరు ఉద్యోగి ఆ లింక్ మీద క్లిక్ చేశాడు. మొబైల్ నంబర్కు ఆధార్ లింక్ అయిందో, లేదో తెలుసుకునేందుకు రూ. 10 ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన కాసేపటికే ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి రూ. 6.20 లక్షలు విత్ డ్రా చేశారు.
దీంతో అప్రమత్తమైన బాధిత ఉద్యోగి అశ్వాపురం సీఐకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొత్తగూడెం సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో దర్యాప్తు చేశారు. సైబర్ నిందితుల నుంచి రూ. 4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.