కురవి: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోల్ పోలీస్స్టేషన్లో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతం శుక్రవారం వెల్లడించారు. కురవి మండలం సిరోల్ పోలీసు స్టేషన్ పరిధిలోని మోదుగుల గూడెం గ్రామానికి చెందిన 1) అనబత్తుల వీరేందర్, 2) కర్ణావత్ రాజు, 3) అనబత్తుల ఉపేందర్, 4) అనబత్తుల వెంకటేశ్, 5) అయిలి వీరేందర్, 6) అనబత్తుల సురేశ్, 7) భానోత్ దేవేందర్ లను పక్కా సమాచారం మేరకు మహబూబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటరత్నం, ఎస్ఐ రామారావు, సిబ్బంది సిరోల్ పోలీసుల సహకారంతో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వీరంతా తెలంగాణ రాష్ట్రంలో నిషేధించిన పలు అప్లికేషన్ల ద్వారా బెట్టింగ్ చేస్తుండగా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోడి పందాలు, పేకాట, ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల డబ్బుతోపాటు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు. గ్రామాల్లో పేకాట బెట్టింగ్లకు పాల్పడుతున్న వారి సమాచారం పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. నేరస్తులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ సీఐ వెంకటరత్నం, ఎస్ఐ రామారావు, సిరోల్ ఎస్ఐ లావుడ్యా నరేశ్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. నగదు అవార్డులను అందజేశారు.