లింగాలఘనపురం,సెప్టెంబర్ 27: భూ వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగులలో మంగళవారం చోటు చేసుకుంది.
ఎస్సై రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొబ్బల రవీందర్(36), కందగట్ల భాస్కర్ మధ్య కెనాల్ ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 384లో ఉన్న వ్యవసాయ భూమిలో వివాదం ఉంది.
దీంతో రెండేళ్ల నుండి గొడవలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో రవీందర్ కూలీలతో ఆ ప్రాంతంలో సరిహద్దు కనీలు నాటుతుండగా భాస్కర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో భాస్కర్ గడ్డపారతో రవీందర్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య రాధ, ఇద్దరు కుమారులున్నారు. సంఘటనా స్ధలాన్ని ఎస్సై రఘుపతి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనగామ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.