మహబూబాబాద్ : పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు..నర్సింహులపేట నుంచి గుండంరాజుపల్లికి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నర్సింహులపేట శివారులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దుబ్బ వెంకన్న (50)
మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కాగా, అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.