బెంగళూరు: రోడ్డు పక్కగా నడుస్తున్న వారి పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫుట్పాత్పై నడుస్తున్న వారి మీదకు ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి గాల్లో ఎగిరిపడ్డాడు. మరో ముగ్గురు అక్కడ పార్క్ చేసిన వాహనాల మధ్య ఇరుక్కుని గాయపడ్డారు.
శివమొగ్గ జిల్లా బెల్లూరు గ్రామానికి చెందిన రుద్రప్ప, అలియాస్ సురేష్ కుమార్ క్యాటరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. తన సహోద్యోగులతో కలిసి ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఇద్దరు సహోద్యోగులతో కలిసి రుద్రప్ప బస్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చెన్నహళ్లికి చెందిన అసిస్టెంట్ ఫిల్మ్ మేకర్ ముఖేష్ తన స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి కారులో వేగంగా వెళ్తుండగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో నడుస్తున్న వారి మీదకు కారు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో గాయపడిన రుద్రప్ప, అతడి సహచరులు సచిన్, శివరాజుతోపాటు విద్యార్థి శైలేంద్రను ముఖేష్, అతడి స్నేహితుడు కలిసి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రుద్రప్ప మరణించాడు. గత రెండు రాత్రులుగా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ముఖేష్, నిద్ర లేమి వల్ల కారు నడుపుతూ ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది.
BENGALURU: CAR RAMS INTO PEDESTRIANS
1 killed and 3 injured when a speeding car rammed into a bunch of pedestrians, The incident occurred in #Bengaluru's Banashankari area.@dpkBopanna reports. pic.twitter.com/VZxrzT7n47
— Mirror Now (@MirrorNow) May 21, 2022