జైపూర్ : ఓ 17 ఏండ్ల యువకుడు తన భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేసిన ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన రాజేశ్ రాణా అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దీంతో రెండు నెలల క్రితం యువతి కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత రాయ్పూర్ మీదుగా రాజస్థాన్కు వెళ్లి అక్కడ ఇటుకబట్టీలో కార్మికులుగా చేరి జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో అక్కడ రాజేశ్కు 55 ఏండ్ల మహిళ పరిచయమైంది. ఆమెకు తన భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో రాజేశ్ విలాసవంతమైన జీవనం గడుపుతూ.. మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ను కూడా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత భార్య తండ్రికి ఫోన్ చేసి.. ఆమె మరొకరితో వెళ్లిపోయిందని రాజేశ్ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ రాజేశ్ మాటలను భార్య కుటుంబ సభ్యులు నమ్మలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. మొత్తానికి రాజేశ్ భార్యను 55 ఏండ్ల మహిళ చెర నుంచి పోలీసులు విడిపించారు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. తనకు గుండె సమస్యలు ఉన్నందుకే భార్యను అమ్మానని, వచ్చిన నగదుతో సర్జరీ చేయించుకునేందుకు ప్లాన్ చేసినట్లు రాజేశ్ పోలీసుల విచారణలో తెలిపాడు. విచారణ అనంతరం రాజేశ్ను జువైనల్ కోర్టుకు తరలించారు.