న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్లో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కరుడు గట్టిన నేరస్తుడు కుల్దీప్ మాన్ అలియాస్ ఫజ్జాపై రూ.2 లక్షల పోలీస్ రివార్డ్ ఉన్నది. గత ఏడాది మార్చిలో అరెస్టైన అతడ్ని ఈ నెల 25న చికిత్స కోసం గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు.
అయితే అక్కడ మాటు వేసిన కుల్దీప్ అనుచరులు ఒక్కసారిగా పోలీసుల కండ్లలో కారం చల్లారు. అనంతరం స్కార్పియో కారు, ఒక బైక్పై వారు పారిపోతుండగా పోలీసులు కాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక అనుచరుడు మరణించగా మరొకడు గాయపడ్డాడు. మిగతా అనుచరులతో కలిసి కుల్దీప్ తప్పించుకుని పారిపోయాడు. దీంతో అతడ్ని పట్టుకునేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
పోలీస్ కాల్పుల్లో గాయపడిన కుల్దీప్, అతడి అనుచరులు రోషిణీ సెక్టార్ 14లోని ఒక ఫ్లాట్లో దాగినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ బృందానికి సమాచారం అందింది. దీంతో ఆదివారం ఉదయం ఆ ఫ్లాట్ను చుట్టిముట్టిన పోలీసులు లొంగిపోవాలని వారిని హెచ్చరించారు. అయితే వారు కాల్పులు జరుపడంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన కుల్దీప్ను అంబేద్కర్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరోవైపు ఆ ఫ్లాట్లోని మిగతా అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుల్దీప్ నేతృత్వంలోని గోగి ముఠా పలు దోపిడీలు, డబ్బుల వసూళ్లు, కార్ జాకింగ్ వంటి అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.