న్యూఢిల్లీ : వృద్ధులతో వివాహం కోసం మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ముఠాను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏండ్ల బాలిక అదృశ్యమైన కేసులో రబుపురా పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ ముఠా బాగోతం బయటపడిందని డీసీపీ వృందా శుక్లా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ 26న బాలిక అదృశ్యం కాగా రబుపుర పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
బాలిక ఇంటి వెలుపల ఆడుకుంటుండగా అదృశ్యమైందని బాధితురాలి తల్లి పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలికను హర్యానాలో గుర్తించారు. ఆమెను రూ 70,000కు కొనుగోలు చేసిన జస్వీర్ (52) బాలికను పెండ్లి చేసుకున్నాడు. ఈ ఉదంతంలో ముఠా ఆగడాలను కనిపెట్టిన పోలీసులు ఈ రాకెట్కు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశారు.
ఈ ముఠాకు చెందిన మహిళలు బాలికలను మభ్యపెట్టి ఆపై కిడ్నాప్ చేసి వయసు మళ్లినవారికి విక్రయిస్తుంటారు. హర్యానాలోని రోహ్తక్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన బాలికలను కూడా ఈ ముఠా అపహరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ జస్వీర్ సహా ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.