నిజామాబాద్ : జిల్లాలో గత పది రోజుల క్రితం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ కార్తికేయ వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..బోధన్ మండలం జాడీ జమాల్పూర్ గ్రామానికి చెందిన బోధ సాయి తేజ (22) పలు దొంగతనాలకు పాల్పడుతూ జైలుకెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన సాయి తేజకు జైల్లోనే మరో ఇద్దరు దొంగలు పరిచయమయ్యారు. వారు బెయిల్ పైన బయటకు వచ్చారు. అనంతరం ముగ్గురు కలిసి వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.
దోచిన సొత్తు పంపకాల విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బండ వాడ లక్ష్మణ్, పల్లపు కుమార్ కలిసి సాయి తేజను హతమార్చడానికి పక్కా ప్రణాళికను రూపొందించారు. దాంట్లో భాగంగానే ఈ నెల 1వ తేదీన సాయి తేజ ఇంటికి వెళ్లి తమ వెంబడి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో మద్యం సేవించి అక్కడి నుంచి మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం సాయి తేజ తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శవాన్ని వదిలేసి ఇద్దరు పరారయ్యారు. హంతకులు బోధన్ మండలం జాడీ జమాల్పూర్ గ్రామంలో సాయి తేజ ఇంటికి వెళ్లి దొంగతనం కేసులో మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని మృతుడి భార్యకు చెప్పారు.
రెండు రోజులైనా భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న మాక్లూర్ పోలీసులు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.
మృతదేహాన్ని గుర్తించిన ఘటనా స్థలంలో దొరికిన సెల్ఫోన్ ద్వారా ఆ సెల్ కి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారని సిపి కార్తికేయ తెలిపారు.
నిందితుడు నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, ఒక లారీతో పాటు హత్యకు ఉపయోగించిన రాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. కాగా, ఇదే కేసులో మరో నిందితుడు పల్లపు కుమార్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.