Karnataka | కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం, పాల వ్యాన్ ఢీ కొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని ఆర్సికేరే వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
ధర్మస్థల ఆలయాల దర్శనానికి వెళ్లిన 14 మంది యాత్రికులు స్వగ్రామానికి తిరుగు పయణమయ్యారు. ఈ క్రమంలో ఆర్సికేరే వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం, పాల వ్యాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని హసన్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు హసన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.