న్యూఢిల్లీ : అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ సిండికేట్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ 40 కోట్ల విలువైన 6.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్, నైజీరియన్ పౌరుడు ఒబుమునెమి ఎంచుక్వుగా గుర్తించారు.
ఎంచుక్వు ప్రస్తుతం ఢిల్లీలోని మహేంద్ర పార్క్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. నిందితుల నుంచి పోలీసులు ప్రాసెసింగ్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ అద్దెకు ఉంటున్న నివాసం నుంచి నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
పశ్చిమ ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్లు సిండికేట్లోని ఇతర సభ్యుల సహకారంతో నార్కోటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం రావడంతో దాడులు చేపట్టామని ఏసీపీ స్పెషల్ సెల్ అత్తార్ సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో డ్రగ్ కన్సైన్మెంట్స్ను క్లయింట్లకు సరఫరా చేస్తోందని చెప్పారు. సిండికేట్ సభ్యుల కదలికలను పసిగట్టి జీటీ కర్నాల్ రోడ్లో దాడులు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.