Digital Arrest | సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ, ట్రాయ్ కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నా.. సైబర్ మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకు సైబర్ నేరగాళ్లు.. ఐపీఎస్, సీబీఐ అధికారులుగా పరిచయమై దోపిడీకి పాల్పడ్డారు.
నోయిడాలోని ఓ మహిళకు గత నెల 13న ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్ చేశారు సైబర్ మోసగాళ్లు. ఆమె ఆధార్ కార్డు నంబర్తో ఆగంతకులు సిమ్ కార్డు కొనుగోలు చేసి స్త్రీలను వేధించారని చెబుతూనే మరో వ్యక్తికి కాల్ ట్రాన్స్ఫర్ చేశాడు. నోయిడా పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి .. ఈ కేసుపై విచారణ చేపట్టాలని భయపెట్టాడు. అప్పటిదాక స్కైప్లో కనెక్టయి ఉండాలన్నాడు. స్కైప్ ద్వారా విచారించిన వ్యక్తి.. ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని.. సుప్రీంకోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసిందన్నాడు. దీనిపై విచారణ రహస్యంగా సాగాలని, బయటి వారికి చెబితే శిక్ష పెరగవచ్చునని హెచ్చరించాడు. తన విచారణ పూర్తి చేశానని, ముంబై నుంచి మరో అధికారి విచారిస్తాడని చెప్పి.. స్కైప్ ఐడీ ఇచ్చాడు. ఆ అధికారితో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని చెప్పాలన్నాడు.
తర్వాత కొద్ది సేపటికి స్కైప్లో సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న మరో మోసగాడు కేసు విచారిస్తున్నట్లు నటించాడు. మనీ లాండరింగ్ చేసిన ఒక విమానయాన సంస్థ ఫౌండర్ ఇంట్లో 246 డెబిట్ కార్డులు దొరికాయని, అందులో మీ డెబిట్ కార్డు కూడా ఉందని చెప్పుకొచ్చాడు. మీ ఖాతాలోకి రూ.2 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని, ఎయిర్ లైన్స్ సంస్థ రూ.20 లక్షలు పే చేసిందన్నాడు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఆ మొత్తం పే చేయాలని, లేకుంటే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించాడు.
ఆ మనీ ఐసీఐసీఐ ఖాతాకు, అటుపై పీఎఫ్సీ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయాలని ఆ మహిళను బెదిరించాడు. తొలుత ఆమె తనకేం తెలియదని వ్యతిరేకించినా రకరకాలుగా బెదిరింపులకు దిగాడు. చివరకు ఆమె భయపడి ఆమె తనకు వేర్వేరు ఖాతాల్లో ఉన్న రూ.11.11 లక్షల మనీ ఐసీఐసీఐ ఖాతాకు బదిలీ చేసింది. ఆ ఖాతా డిటైల్స్ ముందే తెలుసుకున్న సైబర్ మోసగాళ్లు.. మొత్తం ఒకేసారి దోచుకున్నారు. తర్వాత ఈ సంగతి గుర్తించి.. సదరు బాధితురాలు నోయిడా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో అసలు సంగతి బయట పడింది.