కొల్లాం: భార్యను చంపడానికి ఆ భర్త వింత పద్ధతిని ఎంచుకున్నాడు. భార్యకు జరిగిన చిన్న ప్రమాదం వల్ల చుట్టుపక్కల వారు ఆమెపై పాము పగబట్టిందని అనుకుంటున్నట్లు అతనికి తెలిసింది. అందుకే తనే పాములను తీసుకొచ్చి భార్యపైకి వాటిని ఉసిగొల్పి హత్య చేశాడు. ఈ ఘటన కేరళలలోని కొల్లాంలో వెలుగు చూసింది. సూరజ్, ఉత్ర దంపతుల కాపురం సాఫీగా సాగిపోతోంది. అయితే గతేడాది మే నెలలో పాము కాటుతో ఆమె మరణించింది. దీనికి పాములు ఆమెపై పగబట్టడమే కారణమని అంతా భావించారు.
కానీ ఉత్ర తల్లిదండ్రులకు ఏదో అనుమానం కలిగింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఒళ్లు జలదరించే నిజాలు వెలుగు చూశాయి. భార్యకు పాము శాపం తగిలిందని చుట్టుపక్కల వారు అనుకుంటున్నట్లు సూరజ్కు తెలిసింది. దీంతో పథకం వేసిన అతను 2020 మార్చిలో ఆమెపైకి ఒక విషసర్పాన్ని వదిలాడు. దాని కాటుతో ఉత్ర తీవ్ర అనారోగ్యంపాలైంది. 52 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాక కోలుకుంది. ఆ వెంటనే రూ.10 వేలు ఖర్చుపెట్టి మరోసారి పాములు పట్టే సురేష్ అనే వ్యక్తిని సూరజ్ పిలిపించాడు.
అతని సాయంతో మే నెలలో తాచుపామును భార్యపైకి పంపించాడు. అది కూడా ఆమెను కాటేసింది. అయితే ఈసారి ఆమె కన్నుమూసింది. కుమార్తె మరణంపై అనుమానం వచ్చిన ఉత్ర తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. పాములు పట్టే సురేష్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను అప్రూవర్గా మారి జరిగిందంతా పోలీసులకు చెప్పేశాడు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించాలని వాదించిన న్యాయవాది, సూరజ్కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తుదితీర్పు అక్టోబరు 13న వెలువడనుంది.