ముంబై : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Online Scam) పెచ్చుమీరుతున్నాయి. సైబర్ నేరాలపై పోలీసులు, అధికారులు ప్రజల్లో ఎంత అవగాహన కలిగిస్తున్నా ఆన్లైన్ వేదికగా నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. లేటెస్ట్గా నవీ ముంబైకి చెందిన మహిళ లిప్స్టిక్ ఆర్డర్ ఇస్తూ తన బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ. లక్ష పోగొట్టుకుంది. నవంబర్ 2న నగరానికి చెందిన డాక్టర్ ఈ-కామర్స్ సైట్లో రూ. 300 విలువ చేసే లిప్స్టిక్ ఆర్డర్ చేసింది.
ఈ క్రమంలో ఆమె ఆర్డర్ రిసీవ్ చేసుకోకున్నా పార్సిల్ డెలివరీ చేసినట్టు మహిళకు కొరియర్ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె కంపెనీని సంప్రదించగా కొద్దిసేపట్లో మిమ్మల్ని కస్టమర్ కేర్ ప్రతినిధి సంప్రదిస్తారని బదులిచ్చారు. ఆపై ఓ వ్యక్తి నుంచి మహిళకు కాల్ వచ్చింది. మీ ఆర్డర్ హోల్డ్లో పెట్టామని రూ. 2 పేమెట్ చేయాల్సి ఉంటుందని సదరు వ్యక్తి నమ్మబలికాడు.
ఆమె తన బ్యాంక్ వివరాలను పొందుపరచాలని చెబుతూ కాలర్ ఓ వెబ్లింక్ పంపాడు. ఈ కాల్ నిజమైనదేనని నమ్మిన మహిళ లింక్ను క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. ఆపై కాలర్ సూచించిన విధంగా రూ. 2 చెల్లించింది. ఇక ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 95,000, రూ. 5000 డెబిట్ అయ్యాయని మహిళకు నోటిఫికేషన్స్ వచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More :