ముంబై : ఆన్లైన్ స్కామ్లు రోజురోజుకూ పెరుగుతుండగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ (Cyber Fraud) ఆన్లైన్ వేదికగా అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. రోజుకో తరహా మోసంతో స్కామర్లు రెచ్చిపోతున్నారు. ఇక లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యక్తి (38) బ్యాంక్ జాబ్కు అప్లై చేస్తూ రూ. 6 లక్షలు పోగొట్టుకున్నాడు.
బాధితుడు ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తుండగా నిందితులు కలిశారు. తాము ఓ ప్రముఖ బ్యాంకు అధికారులమంటూ పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు అతడికి బ్యాంకులో మంచి జాబ్ ఇప్పిస్తామని ఆఫర్ చేశారు. మెరుగైన వేతనంతో ఉద్యోగ ఆఫర్ ఉందని వారు ఊరించడంతో దరఖాస్తు చేసేందుకు బాధితుడు అంగీకరించాడు.
అప్లికేషన్ కోసమని నిందితులకు రూ. 100 చెల్లించాడు. ఈ క్రమంలో స్కామర్లు బాధితుడి బ్యాంక్ వివరాలు తెలుసుకున్నారు. ఈ వివరాలతో స్కామర్లు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రెండు లావాదేవీలతో రూ. 6 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. అనధికార లావాదేవీలు జరిగిన విషయం తెలిసి తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేక్ ఆన్లైన్ జాబ్ స్కామ్స్ ఇటీవల పెచ్చుమీరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read More :