భోపాల్: ఈ మధ్య అటవీ ప్రాంతాల పరిసర గ్రామాల్లో జనంపై వన్య మృగాల దాడులు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పొయ్యిల కట్టెల కోసం వెళ్లిన ఒక మహిళపై చిరుతపులి దాడిచేసి ( Leopard Attack ) చంపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని జిల్లా కియోలరీ బ్లాక్లోని మోహ్గావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తోటి గ్రామస్తులతో కలిపి ఓ 50 ఏండ్ల మహిళ పొయ్యిల కట్టెల కోసం సమీప అడవిలోకి వెళ్లింది.
అక్కడ అందరూ కలిసి పొయ్యిల కట్టెలు సేకరిస్తుండగా చెట్ల మాటున దాగివున్న చిరుతపులి ఒక్కసారిగా 50 ఏండ్ల మహిళపై దాడిచేసింది. చిరుతపులిని చూడగానే తోటి గ్రామస్తులంతా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలించగా మృతదేహం లభించింది. కాగా, కౄరమృగాల సంచారం ఉన్నందున అడవిలోకి రావద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా పరిసర గ్రామాల ప్రజలు పట్టించుకోవడం లేదని అధికారులు చెప్పారు.