మంచిర్యాల : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం ఆ కుటుంబాన్ని కాటేశాయి. ఎంతో జీవితంమున్న అభం శుభం తెలియని పసి పిల్లల ప్రాణాలతో పాటు తల్లీని బలిగొన్నాయి. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన చెన్నాల ధనలక్ష్మి(23) సాయికిరణ్ ఇద్దరు ప్రేమించి ఏడేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు ఇద్దరు కూతుళ్లు సమన్విత (6), శంకరి (6 నెలలు) ఉన్నారు. కులాల వేరైనా ఇద్దరు దంపతులతో పిల్లలతో కలిసి అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు తెలిపారు.
ఇద్దరు కలిసి బతుకుదెరువు కోసం గత మూడు నెలల క్రితం లక్సెట్టిపేట పట్టనానికి వచ్చారు. గోదావరి రోడ్డులోని వీకర్ సెక్షన్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పిల్లలో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. రోజు మాదిరిగానే భర్త శనివారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమవగా.. ధనలక్ష్మి వంట చేసి భర్తకు సద్ది కట్టి పంపింది. పని ముగించుకుని సాయత్రం భర్త సాయికిరణ్ ఇంటికి వచ్చాడు. తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియ వేసి ఉన్నది. తలుపు ఎంత కొట్టిన తెరుకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఇద్దరు పిల్లలతో దూలానికి విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు.
వెంటనే సాయి కిరణ్ చుట్టు పక్కల వారిని పిలిచి తలుపులను బలంగా తన్నడంతో ఊడిపోయాయి. అప్పటికే ధనలక్ష్మి, సమన్విత, శంకరి కిందకు దించగా.. అప్పటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ ఖరీముల్లాఖాన్, ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే, ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, అప్పులే కారణమని సమాచారం. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.