అహ్మదాబాద్ : మైనర్ బాలిక (17) ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసి వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుజరాత్లోని హల్వద్లో వెలుగుచూసింది. బాలిక ఈ విషయం తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటకువచ్చింది. బాలిక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని నిందితులు బెదిరిస్తూ నెలల తరబడి ఆమెను లైంగికంగా వేధించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు జయేష్ కంజరియ, మెహుల్ హదియల్ తమ కోరికను నిరాకరిస్తే బాలిక సోదరుడిని చంపేస్తామని కూడా బెదిరించారు. తొలుత కంజరియా బాలికకు స్నేహితుడిగా నటిస్తూ దగ్గరయ్యాడు. ఆపై హదియల్ సైతం స్నేహం పేరుతో ఆమెకు చేరువయ్యాడు. ఇక ముగ్గురు పలుమార్లు కలిసే క్రమంలో నిందితులు బాలిక ఫోటోలను తీసి ఆపై వాటిని చూపి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. గత కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పును పసిగట్టిన తల్లితండ్రులు నిలదీయడంతో ఏడాదిగా జరుగుతున్న ఘోరం గురించి వారికి తెలిపింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.