మారేడ్పల్లి : ఒడిశా నుంచి ముంబాయికి సికింద్రాబాద్ మీదుగా రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే డీఎస్పీ చంద్రభాను, ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిజిత్ బోయ్ (20) ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని సరఫరా చేయడానికి 22 కిలోల గంజాయి బ్యాగ్ను తీసుకొని బలూగ్గామ్ రైల్వే స్టేషన్లో ఈ నెల 7న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రైలు చేరుకుంది.
ఈ క్రమంలో రైల్వే జీఆర్పీ పోలీసులు రైలును తనిఖీలు చేస్తుండగా అభిజిత్ బోయ్ అనుమానస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా బ్యాగ్లో గంజాయి దొరికింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నింధితుడి వద్ద నుంచి నాలుగు లక్షల 40 వేల రూపాయాల విలువ చేసే 22 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నింధితుడు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ నేరాల బాట పట్టాడని పోలీసుల విచారణలో వెల్లడైందని డిఎస్పి వెల్లడించారు.