రాయ్పూర్: తమ నిర్బంధంలో ఉన్న 11 మందిని మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. పోలీసులకు సహకరించవద్దని, అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వవద్దని వారిని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్లో పాల్గొన్నట్లు అనుమానించిన మావోయిస్టులు కుండెడ్ గ్రామానికి చెందిన ఏడుగురిని ఈ నెల 18న అపహరించారు. వీరి విడుదల కోసం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు అడవిలోకి వెళ్లిన నలుగురిని కూడా నిర్బంధించారు. మరోవైపు 11 మందిని బంధించడంపై స్థానిక గిరిజన నేతలు, మీడియా నుంచి మావోయిస్టులపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 11 మందిని విడుదల చేశారని, వారు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందరాజ్ తెలిపారు. మావోయిస్టులు ఎందుకు కిడ్నాప్ చేశారన్నదానిపై 11 మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేస్తామన్నారు.