ముంబై : సైబర్ నేరాలు (Cyber Fraud) గణనీయంగా పెరుగుతుండటంతో రోజుకో స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ఫేక్ జాబ్ ఆఫర్ పేరుతో ముంబైకి చెందిన ఓ ఇంజనీర్ను స్కామర్లు ఏకంగా రూ. 24 లక్షలకు మోసగించారు. ఆకర్షణీయ జాబ్ ఆఫర్తో ముందుకొచ్చిన స్కామర్లు జాయినింగ్ ఫార్మాలిటీస్, మెడికల్ చెకప్ పేరుతో బాధితుడిని నిండా ముంచారు. పుణేలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీలో రెండు దశాబ్ధాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి (50) ఈ స్కామ్లో రూ. 24 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్న వ్యక్తి తన ప్రొఫైల్ను పలు జాబ్ లిస్టింగ్ సైట్స్లో అందుబాటులో ఉంచాడు. ఈ ఏడాది మార్చిలో ఓ రిక్రూట్మెంట్ సంస్ధలో పనిచేస్తున్నానని చెబుతూ మహిళ అతడికి కాల్ చేయడంతో ఈ దోపిడీకి తెరలేచింది. గ్లోబల్ కారు తయారీ కంపెనీ భారత యూనిట్లో సీనియర్ పొజిషన్ను మీ పేరు షార్ట్లిస్ట్ చేశామని మహిళ అతడిని నమ్మబలికింది. జాబ్ అప్లికేషన్లో భాగంగా పోర్టల్లో రూ. 1600 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. టెలిఫోన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరింది.
ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే మీరు ఎంపికయ్యారని తెలిపింది. ఇక కంపెనీ యూనిఫాం, ఫుల్ బాడీ చెకప్ కోసం రూ. లక్ష పంపాలని స్కామర్లు కోరారు. ఆపై డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్ ఫార్మాలిటీస్తో ఐదు నెలల పాటు అతడిని డబ్బు పంపాలని మభ్యపెట్టారు. అధిక వేతనంతో గ్లోబల్ కార్మేకింగ్ కంపెనీలో చేరుతున్నాననే ఆలోచనతో బాధితుడు స్కామర్లు అడిగినంత ముట్టచెప్పాడు. 40 లావాదేవీల్లో దాదాపు రూ. 24 లక్షలు చెల్లించిన తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
Read More :