అహ్మదాబాద్ : మహిళపై యాసిడ్ పోస్తానని బెదిరించిన వ్యక్తిపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 25 ఏండ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని ముస్తాక్ మన్సూరీగా గుర్తించారు. అహ్మదాబాద్లోని జుహపురకు చెందిన మహిళకు ఏడేండ్లుగా ముస్తాక్ మన్సూరీతో పరిచయం ఉంది.
గత కొద్దిరోజులుగా మహిళ మన్సూరీతో మాట్లాడటం మానివేసి దూరం పెడుతోంది. నిందితుడు శనివారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటికి వెళ్లి ఈ విషయమై గొడవ పడ్డాడు. ఇక నుంచి స్నేహితులుగా ఉండటం కుదరదని మహిళ తేల్చిచెప్పడంతో ఆమె పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడు.
తనతో మాట్లాడకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత మహిళ కుటుంబసభ్యులతో కలిసి పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.