అహ్మదాబాద్ : తనతో సంసారం చేయకుండా భర్త తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగుచూసింది. శారీరకంగా కలుద్దామని కోరిన ప్రతిసారీ భర్త తనను కొడుతున్నాడని, ఈ ఏడాది ఆగస్ట్లో తనను పుట్టింట్లో వదిలివేశాడని బాధితురాలు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళకు ఈ ఏడాది ఫిబ్రవరి 27న వివాహం కాగా అప్పటి నుంచి భర్త, అత్తింటి వారు కట్నం తగినంత తీసుకురాలేదని వేధిస్తుండే వారు. భర్త తనతో పది రోజుల పాటు సంసారం సజావుగానే చేయగా, ఆపై తనకు దూరంగా ఉండేవాడని, తాను శారీరకంగా దగ్గరవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారీ తనపై దాడి చేసి వేధించేవాడని మహిళ వాపోయారు.
తాను అందంగా లేనని మరో మహిళతో లైంగిక సంబంధం పెట్టుకుంటానని బెదిరించేవాడని తెలిపారు. భర్త, మెట్టినింటి వేధింపులతో విసుగు చెందిన తాను ఆగస్ట్ 1న ఇల్లు విడిచివెళ్లగా పెద్దలు జోక్యం చేసుకుని మరోసారి ఇలాంటివి జరగవని నమ్మబలకడంతో తిరిగి భర్త దగ్గరకు వచ్చానని బాధితురాలు వెల్లడించారు. భర్త, అత్తింటి వారిలో ఎలాంటి మార్పులేదని వారం రోజుల తర్వాత ఆగస్ట్ 8న పుట్టింటి వద్ద తనను భర్త దింపివెళ్లాడని వివరించారు. భర్తపై మహిళ ఫిర్యాదుతో నిందితుడు అతడి కుటుంబ సభ్యులపై గృహ హింస సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.