న్యూఢిల్లీ : గత ఏడాదిగా సైబర్ నేరాలు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ వేదికగా అమాయకులే లక్ష్యంగా నేరగాళ్లు చెలరేగుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇక లేటెస్ట్గా పుణేలో క్లినికల్ రీసెర్చర్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ లింక్ను క్లిక్ చేసి ఏకంగా రూ. 2.1 కోట్లు కోల్పోయాడు. ప్రముఖ అమెరికన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను పోలిన నకిలీ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంగా పేర్కొంటూ స్కామర్లు ఈ భారీ మోసానికి తెరలేపారు. ఇండియన్ క్లినికల్ రీసెర్చ్ సంస్ధలో స్టాటిస్టిక్స్ విభాగంలో పనిచేసే 45 ఏండ్ల వ్యక్తి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో మోసపోవడంతో వాకడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఆరంభంలో సదరు వ్యక్తి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పట్ల ఆసక్తి కనబరిచే క్రమంలో సోషల్ మీడియాలో అమెరికాకు చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ ఫండ్కు సంబంధించిన షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం యాడ్ కంటపడింది. అందులో పేర్కొన్న లింక్ను అతడు క్లిక్ చేయగా వాట్సాప్ గ్రూప్లోకి ఇన్వైట్ చేశారు. ఆన్లైన్ ట్యుటోరియల్స్, లింక్స్ అందిస్తూ గ్రూప్ అడ్మిన్లు ఆ ప్లాట్ఫాం ద్వారా పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించారు. వారం రోజుల్లోనే బాధితుడు ఏకంగ రూ. 2.15 కోట్ల పెట్టుబడులు పెట్టాడు.
ఆస్తులు అమ్మడంతో పాటు రుణం తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టాడు. ఆపై ఓ ఆయిల్ కంపెనీ ఐపీఓలో రూ. 4.33 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని గ్రూప్ డిమాండ్ చేయగా ఆయన నిరాకరించడంతో అసలు మోసం బయటపడింది. దీంతో అతడి పెట్టుబడులను ఫ్రీజ్ చేయడంతో పాటు కమ్యూనికేషన్ను నిలిపివేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు స్కామ్లో నిందితులు వాడిన కంపెనీ పేరుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Arvind Kejriwal | జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్