భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసింది. వినోద్ కుమార్ దూబే (47) అనే వ్యక్తి తన భార్యతో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు.
ఆ సమయంలోనే తనకు భోజనం పెట్టాలని ఆమెను అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. అలా కొట్టి కొట్టి చివరకు ఆమె మొఖంపై దిండు వేసి నొక్కేశాడు. ఊపిరి అందకపోవడంతో ఆమె చనిపోయింది. ఆ శవం పక్కనే పడుకొని నిద్రపోయిన అతను.. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు భార్య చనిపోయిందని గుర్తించాడు.
దాంతో భయపడిపోయి ఇంట్లో ఉన్న కొంత డబ్బు తీసుకొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఉదయం 9.30 సమయంలో ఆమె మరణ వార్తను తెలుసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి వినోద్ ఎక్కడ ఉన్నదీ ట్రేస్ చేశారు.
ఢిల్లీ దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.40 వేల డబ్బు, కొన్ని విలువైన వస్తువులు, రక్తంతో తడిసి ఉన్న ఒక దిండును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.