ఒక్కోసారి వాస్తవ కథలే సినిమాల కన్నా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన అలాంటిదే. స్థానికంగా రోహిణీ ప్రాంతంలో నివశించే తరుణ్ అలియాస్ రోహన్ చిన్నతనంలో చెడుసహవాసాలు పట్టాడు. ఇటీవల వరుసగా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే సురేందర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయే సమయంలో తన మొబైల్ అక్కడే మర్చిపోయాడు.
దీన్ని పట్టుకొని తరుణ్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు ఫలితం దక్కలేదు. అయితే ఈ మొబైల్ ద్వారా తెలిసిన కొంత సమాచారం వల్ల ఒక ఇన్ఫార్మర్.. తరుణ్ను గుర్తించాడు. అతను ఎక్కడ ఉన్నదీ పోలీసులకు ఉప్పందించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తరుణ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా తను చిన్నతనంలోనే చెడుసహవాసాలు పట్టానని, చదువు మానేసి దొంగతనాలు చేయడం ప్రారంభించానని తరుణ్ అంగీకరించాడు.
వచ్చే రాఖీ పండుగ సమయంలో తన చెల్లికి స్కూటర్ కొనివ్వాలనే ఆశతో.. ఇటీవల దొంగతనాల జోరు పెంచినట్లు చెప్పుకొచ్చాడు. తరుణ్ అరెస్టుతో స్థానికంగా జరిగిన సుమారు ఆరు క్రిమినల్ కేసులు సాల్వ్ అయ్యాయని, అలాగే దొంగతనానికి గురైన మూడు మొబైల్స్, ఒక మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.