చెన్నై : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి మృతదేహాన్ని టీవీ టేబుల్ కింద దాచిన ఘటన చెన్నైలోని ఒట్టేరిలో కలకలం రేపింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడిని ఎన్ రమేష్ (46)గా గుర్తించారు. తల్లి గురించి నిందితుడి పెద్ద కుమారుడు ప్రశ్నించగా ఆమె తన బాయ్ఫ్రెండ్తో వెళ్లిపోయిందని ఇక తిరిగి ఇంటికి రాదని రమేష్ చెప్పాడు.
తల్లి కోసం పిల్లలు ఆమె తరచూ వెళుతుండే ప్రదేశాలకు వెళ్లి చూడగా కనిపించకపోవడంతో ఇంటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి దుర్వాసనం రావడంతో టీవీ టేబుల్ కింద వస్త్రంలో చుట్టిన మృతదేహం కనిపించడంతో పిల్లలు బోరుమన్నారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అనుమానంతో రమేష్ తన భార్య తలను గోడకు కొట్టడంతో ఆమె మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.