అమరావతి: నెల్లూరు జిల్లాలో చిన్నారిని అపహరించిన వ్యక్తిని గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. అపహరణకు గురైన చిన్నారి తల్లి చనిపోగా, తండ్రి శీనయ్య ఆమెను వదిలేయడంతో తాతయ్యల ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో పార్కులో భిక్షాటన చేస్తూ అమ్మమ్మ, తాతయ్యలు చిన్నారిని పోషిస్తున్నారు. అయితే నిన్నరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే రంగంలోకి దిగారు. సంతపేట పోలీసులు కెమెరాలో రికార్డయిన అపహరణ దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. కొద్ది గంటల్లోనే కిడ్నాపర్ ను పట్టుకుని చిన్నారిని రక్షించగలిగారు. పోలీసులు నిందితుడిని తిరుపతిలో గుర్తించగా, చిన్నారిని తీసుకెళ్లి అమ్మమ్మలు, తాతయ్యలకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.