తిరువనంతపురం : ఆస్తి వివాదాల కారణంగా ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన కుమారుడు, కోడలితో సహా ఇద్దరు మనుమరాండ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
హమీద్(79) అనే వృద్ధుడికి కుమారుడు, కోడలు, ఇద్దరు మనుమరాండ్లు ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి తండ్రీకుమారుల మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఆస్తి దక్కించుకోవాలనే ఉద్దేశంతో కుమారుడి కుటుంబాన్ని చంపాలని హమీద్ నిర్ణయించుకున్నాడు.
కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు గాఢ నిద్రలో ఉండగా, కిటికీలో నుంచి పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ దారుణానికి ఒడిగట్టేందుకు ఐదు లీటర్ల పెట్రోల్ వినియోగించాడు. మంటలు ఎగిసిపడటంతో ఆ నలుగురు బయటకు వచ్చేందుకు వీలు కాలేదు. బాధితులు నోరు పోయేలా మొత్తుకున్నప్పటికీ, మంటల కారణంగా బయటి వ్యక్తులు సాయం చేయడానికి కుదరలేదు. దీంతో నలుగురు సజీవ దహనం అయ్యారు.
హమీద్ తన కుటుంబాన్ని చంపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాడు. ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంకులో ఒక్క చుక్క నీటిని కూడా ఉంచలేదు. బకెట్లలో కూడా వాటర్ ఉంచలేదు. అలా ఒక ప్లాన్ ప్రకారం.. ఆ కుటుంబాన్ని అంతమొందించాడు. దీంతో మంటలను ఆర్పేందుకు లోపల ఉన్న వారికి వీలు కాలేదు.
నలుగురి మృతదేహాలను చూసి, అక్కడున్న వారంతా కన్నీరుమున్నీరు అయ్యారు. మంటలధాటికి ఒకరికొకరు పట్టుకోవడంతో అందరి శవాలు ఒకే ముద్దగా మారాయి. మృతదేహాలను వీడదీయలేని విధంగా ముద్దగా మారినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి కోసమే తన కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలను చంపినట్లు హమీద్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.