భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ సివిల్ ఇంజినీర్ దారుణానికి ఒడిగట్టాడు. అమానుషంగా ఇద్దరు పిల్లల గొంతులు కోశాడు. ఆ తర్వాత భార్యకు విషమిచ్చి తను కూడా విషం సేవించాడు. ఈ ఘటనలో కొడుకు ప్రాణాలు కోల్పోగా.. బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. భర్త ప్రాణాలు కోల్పోగా, భార్యకు ప్రాణాపాయం తప్పింది. భోపాల్లోని మిస్రద్ ఏరియాలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మస్రద్ ఏరియాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని సివిల్ ఇంజినీర్ (55), అతని భార్య, కొడుకు (16), కుమార్తె (14) ఉంటున్నారు. కరోనా కారణంగా ఉద్యోగం పోవడంతో సదరు సివిల్ ఇంజినీర్కు కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దాంతో పిల్లలిద్దరిని చంపేసి, భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు గత రాత్రి టైల్స్ కట్చేసే మిషన్తో ఇద్దరు పిల్లల గొంతులు తెగ్గోశాడు.
అనంతరం భార్యకు విషమిచ్చి తనూ విషం సేవించాడు. ఉదయం స్థానికులు చూసేసరికి సివిల్ ఇంజినీర్, అతని కుమారుడు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అయితే, తల్లీ, బిద్ద ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తల్లికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. సివిల్ ఇంజినీర్ జేబులో ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం కోల్పోవడంతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు డబ్బులు లేకుండా పోయాయని, ఆర్థిక ఇబ్బందులు భరించలేకనే తాను, తన భార్య గత మూడు రోజులుగా ఆలోచించి ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నామని ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.