తిరువనంతపురం : పెండ్లికి నిరాకరించిందనే కోపంతో గర్ల్ఫ్రెండ్ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డగించిన ఆమె తల్లిపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం కేరళలోని నెడుమంగడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. కేరళ పోలీసులు నిందితుడిని ఆర్యనాడ్కు చెందిన అరుణ్ (28)గా, బాధితురాలిని సూర్య గాయత్రి (20)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం గాయత్రి ఇంటికి వెళ్లిన అరుణ్ పెండ్లి విషయమై ఆమెతో వాదనకు దిగాడు.
అరుణ్కు అప్పటికే వివాహమైందని తెలిసిన గాయత్రి అందుకు నిరాకరించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అరుణ్ గాయత్రి పొత్తికడుపులో 17 సార్లు పొడిచాడు. వంటింట్లో అరుపులు వినిపించడంతో కూతురిని కాపాడేందుకు తల్లి అక్కడకు రాగా నిందితుడు ఆమెపైనా దాడిచేశాడు. గొడవ విషయం తెలిసి స్ధానికులు అక్కడకు చేరుకుని తల్లీ కూతుళ్లను దవాఖానకు తరలించారు.
గాయత్రి చికిత్స పొందుతూ మరణించగా ఆమె తల్లికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. మరోవైపు స్ధానికులు అరుణ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వితంతువైన గాయత్రిని తాను పెండ్లి చేసుకోవాలనుకున్నానని అందుకు ఆమె నిరాకరించిందనే కోపంతో హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.