హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింతే చాలు.. అక్కడికి క్షణాల్లో చేరి మాదక ద్రవ్యాల సరఫరదారులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిస అయిన వారిలో అధికంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. దీంతో అలాంటి ఉద్యోగులపై ఆయా కంపెనీలు చర్యలు ప్రారంభించాయి.
ఓ 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో 50 మంది ఉద్యోగులకు ఐటీ కంపెనీలు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడ్డ మాదక ద్రవ్యాల సరఫరాదారుల వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగుల చిట్టా లభ్యమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్రా, క్యూసాఫ్ట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరాదారులు ప్రేమ్కుమార్, టోనీ, లక్ష్మీపతిల నుంచి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులపై పోలీసులు నిఘా పెట్టారు.