హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి నూనెను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి 52 లీటర్ల హాష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి నూనె తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిన్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నీరూస్ కూడలి వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్ఐ లక్ష్మీనారాయణ తన బృందంతో అక్కడికి వెళ్లి.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 9 కిలోల ఎండు గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నలుగురిని ఫుడ్ డెలివరీ బాయ్ తెలుపుల కిరణ్ కుమార్(22), కేపీ సిద్ధార్థ్(24), బ్యాడ్మింటన్ కోచ్ దీపక్ కుమార్(32), అనిరుధ్ కట్టా(21)గా పోలీసులు గుర్తించారు.