దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద్ది కాలంగా ఇలాంటి ఫిర్యాదులందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చాలా చాక్యంగా దర్యాప్తు చేసి అభయ్ కిశోరీ, సునీల్ బేదీ, అనిల్ కమార్ ఝా అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. కానీ వారి నాయకుడు కురేశ్ ఇంతకుముందే ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తెలిసింది.
పోలీసుల కథనం ప్రకారం.. కురేశ్ అనే వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారి వివరాలను సేకరించి వారికి ఫోన్చేసేవాడు. వారి పాలసీకున్న ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ పెంచి అధిక రుణం ఇప్పిస్తానని నమ్మించేవాడు. అంతేకాదు కొత్త పాలసీ అని, అధిక రాబడి ఉన్న పాలసీ అని చెప్పి పాలసీ హోల్డర్ వద్ద లక్షల్లో డబ్బు కాజేసేవాడు. అలా దోచుకున్న డబ్బంతా ఏడు వేర్వేరు బ్యాంకు అకౌంట్లలోకి వెళ్లేది. ఆ తరువాత ఆ అకౌంట్ల నుంచి నగదు తీసుకునేవారు. కానీ ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ నకిలీవి.
బ్యాంకు ఖాతాదారులకు కమిషన్ ఆశచూపి వారి అకౌంట్లని వాడుకునేవాడు. ఈ మొత్తం వ్యవహారంలో కురేశ్కు అభయ్ కిశోరీ, సునీల్ బేదీ, అనిల్ కమార్ ఝా అనే ముగ్గురు వ్యక్తులు సహాయం చేసేవారు. ఒకరు వేర్వేరు కొత్త సిమ్ కార్డులు సరఫరా చేసేవాడు, మిగతా ఇద్దరు బ్యాంకు ఉద్యోగులుగా, ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్లుగా ముందుకు వచ్చేవారు.