బంజారాహిల్స్, జనవరి 3: సైట్లో మద్యం సేవిస్తున్నారన్న కోపంతో అదే సైట్లో పనిచేస్తున్న యువకుడిపై సెక్యూరిటీ గార్డులు విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బీహార్కు చెందిన పంకజ్కుమార్ (32) అనే యువకుడు నెలరోజుల క్రితం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నం. 14లో నిర్మాణంలో ఉన్న రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ సంస్థ సైట్లో పనిచేస్తున్నాడు. అదే సైట్లో పనిచేస్తున్న అన్న కొడుకు రాజేశ్ పాశ్వాన్తో పాటు మరి కొంతమంది స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 1న సాయంత్రం సైట్లోని తమ షెడ్లో మద్యం సేవిస్తున్నారు.
కాసేపటికి అక్కడకు వచ్చిన సెక్యూరిటీ గార్డులు ఆనంద్కుమార్ రాయ్, సంజిత్ తివారీ మద్యం సేవిస్తున్న వారిని దుర్భాషలాడటంతో గొడవ అయింది. ఈ క్రమంలో ఆనంద్కుమార్ రాయ్, సంజిత్ తివారీ తదితరులు కర్రలతో పంకజ్ కుమార్పై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు. అక్కడున్న వారు అడ్డుకునేందుకు యత్నించినా వినకుండా కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా రాత్రంతా తీవ్ర ఇబ్బంది పడిన పంకజ్ కుమార్ మరుసటిరోజు ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన రాజేశ్ పాశ్వాన్ తదితరులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించడంతో కేసు పెట్టేందుకు బాధితులు ముందుకు రాలేదు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి ఈ వ్యవహారంపై పోలీసులు సమాచారం అందుకొని నిందితులపై హత్య కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.