Suicide | న్యూఢిల్లీ : ఓ మహిళ వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కుమార్తెను ఎలాంటి బాధలకు గురి చేయొద్దని కోరుతూ ఆమె తన చేతిపై రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన దక్షిణ ఢిల్లీలోని టిగ్రి ఏరియాలో సోమవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ(37) అనే మహిలకు 2017, జనవరి 16వ తేదీన జితేందర్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లైన నాటి నుంచి జితేందర్తో పాటు అతని సోదరుడు కలిసి లక్ష్మీని మరింత కట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త, మరిది ఆగడాలు భరించలేని లక్ష్మీ.. ఆదివారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది. అయితే తన కుమార్తెను బాధ పెట్టొద్దని, లక్ష్మీ తన ఎడమ చేతిపై రాసుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 304 బీ, 498 ఏ, 506, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎయిమ్స్ హాస్పిటల్లో పోస్టుమార్టం ముగిసిన అనంతరం డెడ్బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.