చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊబకాయం తగ్గడం లేదనే ఆవేదనతో 13 ఏండ్ల బాలిక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరుచ్చిలో వెలుగుచూసింది. పట్టణంలోని అలెగ్జాండ్రియా రోడ్డులోని బాధితురాలి నివాసంలోనే బాలిక తీవ్ర నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో పనిచేసే బాలిక తల్లి ఫిర్యాదుపై పోలీసులు ఆత్మహత్య ఉదంతంపై దర్యాప్తు చేపట్టారు.
8వ తరగతి చదువుతున్న బాలిక తన ఊబకాయంపై మనోవేదనతో ఉరివేసుకుని తనువు చాలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం బాలిక తల్లి ఆఫీసుకు వెళ్లగా మరో గదిలో ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్నాక్స్ ఇచ్చేందుకు అమ్మమ్మ బాలిక రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బాలిక నుంచి ఎలాంటి స్పందన లేదు.
దీంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా శాలువాతో ఉరివేసుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. తాను లావుగా ఉన్నానని భావించిన బాలిక డైట్ ప్లాన్లను అనుసరించినా ఫలితం ఇవ్వకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడంపై యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసినట్టు గుర్తించామని ఏసీపీ అజయ్ తంగం చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.