లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తల్లితో కలిసి కారులో ప్రయాణిస్తున్న బాలిక (19)కు మత్తుమందు ఇచ్చి కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన పిబ్రవరి 4న జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు వారిని పిరోజాబాద్లో రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లీకూతుళ్లు మధురలో కారు డ్రైవర్ను తమను ఇంటి వద్ద దింపేందుకు లిఫ్ట్ ఇమ్మని అడిగారు. హర్యానాలో కూలీలుగా పనిచేస్తున్న తల్లీకూతుళ్లు యూపీలోని స్వస్ధలానికి చేరుకునేందుకు బస్సులో మధుర వచ్చారు. ఆపై తమ ఇంటికి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో కారులో లిఫ్ట్ అడిగారు. కారులో వెళుతుండగా దాహం వేసిన బాలిక నీళ్లు ఇవ్వాలని డ్రైవర్ను కోరింది.
నీళ్లు తాగిన తర్వాత తల్లీకూతుళ్లు స్రృహ కోల్పోయారు. ఆపై బాలికపై డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీఎస్పీ అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు.