జైపూర్ : పేదరికాన్ని ఆసరా చేసుకుని ఉద్యోగం పేరుతో గిరిజన బాలికను అపహరించి వేరొకరికి విక్రయించిన ఘటన రాజస్ధాన్లోని పాలి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడి నుంచి రూ 2 లక్షలకు బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెపై మూడేండ్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు గర్భం దాల్చింది. నిందితుడి చెర నుంచి బాలిక తప్పించుకుని కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక నిందితుల చెర నుంచి తప్పించుకుని మే 3న ఇంటికి రాగా 19 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పలసియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్పూర్లో నివసిస్తోంది. డబ్బు కోసం బాలికను రామ్లాల్ అనే వ్యక్తికి విక్రయించిన సంజయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేండ్ల కిందట సంజయ్, కలుతో కలిసి కూలీగా పనిచేస్తుండగా ఉద్యోగం ఆశ చూపి వారు బాలికను తమతో తీసుకువెళ్లారు.
ఆపై బాలికను పాలి ప్రాంతానికి తీసుకువెళ్లి రాంలాల్కు విక్రయించారు. మూడేండ్ల పాటు రాంలాల్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. రాంలాల్ మద్యం మత్తులో తనను తీవ్రంగా వేధింపులకు గురిచేసేవాడని బాలిక ఆరోపించింది. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.