భోపాల్ : స్కూల్ బస్లో మూడున్నరేండ్ల నర్సరీ విద్యార్ధినిపై బస్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు మహిళా సహాయకురాలు ప్రయత్నించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్ధిని శరీరంపై పెనుగులాడిన గుర్తులను చూసి తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా ఆరోపణలను తోసిపుచ్చింది. ఆపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
నిందితుడికి సాయపడిన మహిళ సహాయకురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై బుకాయించిన స్కూల్ అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని దోషులుగా తేలితే వారిపైనా చర్యలు చేపడతామని చెప్పారు.