ముంబై : చిన్న సమస్యలను భూతద్దంలో చూస్తూ యువత డీలాపడుతోంది. సమస్యలకు బెదిరి తనువు చాలిస్తున్న విద్యాధికుల ఉదంతాలు పెరుగుతున్నాయి. క్షణికావేశంలో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఉసురుతీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే విద్యార్ధి క్యాంపస్ బిల్డింగ్ ఏడవ ఫ్లోర్ నుంచి కిందకు దూకి సోమవారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
మృతుడిని మాస్టర్స్ చేస్తున్న సెకండియర్ విద్యార్ధి (26)గా గుర్తించారు. మృతుడు సోమవారం మద్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో క్యాంపస్ బిల్డింగ్ ఏడో ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలు కాగా ఘట్కోపర్లోని రాజవాది ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి హాస్టల్ గది నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను కుంగుబాటుకు లోనయ్యానని, చికిత్స కోసం మందులు వాడుతున్నానని ఆ నోట్లో మృతుడు పేర్కొన్నాడు.
ఈ నోట్లో తన మృతికి ఎవరూ బాధ్యులు కారని అతడు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్షణికావేశంలో విద్యార్ధి బంగారు భవిష్యత్ను పణంగా పెట్టి బలవన్మరణానికి పాల్పడటం క్యాంపస్లో విషాదం నింపింది.